విశాఖపట్నం: పెదబయలు దళానికి చెందిన ఇద్దరు మహిళా మావోయిస్టులు విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాంబేలు సీత అలియాస్ నిర్మల, పాంగి లచ్చి అలియాస్ శైలు గురువారం విశాఖ ఎస్పీ కృష్ణారావు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల మావోయిస్టులకు ప్రజల నుంచి ఆదరణ లభించకపోవడంతో పాటు అనారోగ్య కారణాలతో మావోయిస్టులు సతమతమవు తున్నారని పేర్కొన్నారు.
దీంట్లో భాగంగానే చింతపల్లి మండలం కోట గున్నల్, గ్రామాలకు చెందిన సీత, లచ్చి అనే ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు. వీరు గత మూడు సంవత్సరాల క్రితం పెదబయలు ఏరియ కమిటీ స్క్వాడ్లో చేరారని ఆయన తెలిపారు. లొంగిన నక్సలైట్లు పలు సంఘటనలలో, నేరాలలో నిందితులుగా ఉన్నారని వెల్లడించారు. ఇద్దరు మహిళా మావోలకు ప్రభుత్వ పరంగా వచ్చే చెరో లక్ష రూపాయలు రివార్డుతో పాటుగా ఇళ్ల స్థలం, వ్యవసాయ భూమిని కూడా అందిస్తామని ఎస్పీ కృష్ణారావు స్పష్టం చేశారు.
ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్లో బలంగా ఉన్న పెదబయలు దళానికి చెందిన చిక్కుడు చిన్నారావు అలియాస్ చిన్నారావు అలియాస్ సుధీర్ లొంగుబాటు అనంతరం ఈ ప్రాంతంలో పెదబయలు దళం బలహీనంగా మారిందని ఎస్పీ వెల్లడించారు.