అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం (Anantapur) జిల్లా పెద్దమడుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మిడుతూరు-గుతి టోల్ ప్లాజా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగిఉన్న లారీని ఓ డీసీఎం ఢీకొట్టింది. అయితే దానివెనుక వస్తున్న మియాపూర్-1 డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సు డీసీఎంను బలంగా గుద్దింది. దీంతో డీసీఎం, ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శకలాల మధ్య ఇరుకున్న మృతదేహాలను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను గుతి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.