అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంబేపల్లి మండలం గుట్టపల్లి సమీపంలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై సంభవించింది.
కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గుట్టపల్లి సమీపంలో కారును వెనకనుంచి లారీ ఢీకొట్టింది. దాంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.
మృతులు చిత్తూరు పట్టణంలోని రామ్ నగర్, సంతపేటకు చెందిన లవ కుమార్, శోభలుగా గుర్తించారు. మంత్రాలయం, శ్రీశైలం పుణ్యక్షేత్రాల నుంచి రెండు కార్లలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.