అమరావతి : శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన జిల్లాలోని గుడిబండ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన హరీష్, భరత్ అనే ఇద్దరు బాలురు పశువులను మేతకు తీసుకెళ్లారు. పశువులు మేత మేస్తుండగా సమీపంలో ఉన్న నీటికుంటలో ఇద్దరు స్నానానికి వెళ్లి లోతు తెలియక అందులో ప్రమాదవాశాత్తు పడి మృతి చెందారు. తమ కుమారులు ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడ్డ కుటుంబ సభ్యులు గ్రామంలో గాలించినా జాడ తెలియరాలేదు.
ఇవాళ నీటి గుంటలో శవాలై తేలడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్థుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.