ఏలూరు: శిశువుల విక్రయం కేసులో కొత్త ట్విస్ట్. ఓ మాజీ మంత్రి కుమారుడు ప్రమేయాన్ని పోలీసులు గుర్తించి ఆధారాలు సేకరించారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా విషయం తెలుసుకుని పారిపోయినట్లుగా సమాచారం. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తున్నది. గుంటూరు కొత్తపేటలోని అహల్య నర్సింగ్హోమ్లో శిశువుల విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి అదృశ్యం కేసులో పోలీసులు విచారణ చేపట్టగా.. శిశువుల విక్రయం కేసు బయటపడటం విశేషం.
ఏలూరు శిశువుల విక్రయం కేసులో మాజీ మంత్రి శనక్కాయల అరుణ తనయుడు డాక్టర్ ఉమాశంకర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పకడ్బంధీగా ఆధారాలు సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు గుంటూరు కొత్తపేట అహల్య నర్సింగ్ హోం నుంచి ఈ తతంగం అంతా నడుస్తున్నట్లు గుర్తించారు. దీనికి ప్రధాన కారకుడిగా అనుమానిస్తూ విచారించేందుకు డాక్టర్ ఉమాశంకర్ను ప్రత్యేక పోలీసు బృందం గుంటూరు వెళ్లింది. అయితే పోలీసుల రాకను పసిగట్టిన డాక్టర్ ఉమాశంకర్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.
ఏలూరు జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో అప్పుడే పుట్టిన శిశువును ఏలూరులో అమ్మకానికి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన చిన్నారి బాలిక కనిపించకుండా పోయిన కేసులో పోలీసుల విచారణ చేపట్టగా శిశువుల విక్రయం బయటపడింది. బాలిక కుటుంబ సభ్యులు శిశువును రూ.2.70 లక్షలకు విక్రయించేందుకు అంగీకరించారని, అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య దళారులుగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని పోలీసు విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 11వ నిందితుడు డాక్టర్ ఉమాశంకర్ కోసం గాలిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరుకు చెందిన కొన్ని ముఠాలు పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ తెలిపారు.