తిరుమల: భక్తులను కాపాడే దేవుడిని కొందరు వినియోగించుకుంటూ అడ్డంగా సంపాదిస్తున్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే కొలువై ఉన్న తిరుమలలోనే భక్తులు మోసపోతున్నారు. భక్తుల విశ్వాసాలను ఆసరాగా చేసుకుని దళారులకు తోడుగా మోసగాళ్లు ఇబ్బడిముబ్బడిగా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులను అప్రమత్తం చేసేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం నడుం బిగించింది.
తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే, సమయానికి కల్యాణం, ప్రత్యేక దర్శనం టికెట్లు అందుబాటులో లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. దాంతో దళారులను ఆశ్రయించి ఎక్కువ ధరలకు టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లుగా నకిలీలు కూడా విజృంభిస్తున్నారు. భక్తులకు దర్శనం టికెట్ పేరుతో భక్తుల్ని నిండా ముంచుతున్నారు. కరోనా సమయంలో వీరి ఆగడాలు మరింత శృతిమించిపోయాయి. శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసగిస్తూ నకిలీ వెబ్ సైట్లు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఈ నకిలీ వెబ్ సైట్ల బారి నుంచి భక్తులను కాపాడేందుకు టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగింది.
తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో వెలుగుచూసిన నకిలీ టికెట్ల విక్రయంపై అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తమైంది. స్వామివారి దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న దాదాపు 39 నకిలీ వెబ్ సైట్లను గుర్తించింది. వీటి విషయంలో గూగుల్ యాజమాన్యంతో చర్చించి మోసపూరిత వెబ్ సైట్ ల తొలగించింది. శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న 17 మంది దళారుల పై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. స్వామి దర్శనం పేరుతో దళారుల మాటలను నమ్మి మోసపోకుండా టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా సేవా టికెట్లు పొందాలని ఎస్పీ అప్పలనాయుడు సూచించారు.