తిరుమలలో ఇవాల్టి నుంచి ఉదయాస్తమాన ఆర్జిత సేవల టిక్కెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లో విరాళాలు అందించే భక్తులకు ఈ టిక్కెట్లను అందిస్తారు. తొలిరోజున 531 ఉదయాస్తమాన ఆర్జిత సేవల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. ఆన్లైన్లో విరాళాలు అందిన తర్వాత ఆయా భక్తులకు ఈ టిక్కెట్లను అందించి సేవల్లో పాల్గొనే అవకాశాం కల్పిస్తారు.
టీటీడీ తన అధికారిక పోర్టల్ tirupatibalaji.ap.gov.in లో ఇవాళ ఉదయం 9.30 గంటలకు సేవా టిక్కెట్లను విడుదల చేసింది. ఉదయాస్తమాన ఆర్జిత సేవా టిక్కెట్ల ద్వారా అందే విరాళాలను తిరుపతిలోని చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధికి ప్రత్యేకంగా వినియోగించనున్నారు. దాతలను ప్రోత్సహించేందుకే ఈ ఉదయాస్తమాన ఆర్జిత సేవా టిక్కెట్లను అమలు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మొత్తం ఉదయాస్తమన టిక్కెట్ల సంఖ్య 2,400 కు పరిమితం చేశారు. వీటిలో నుంచి తొలిరోజు 531 టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చారు. 25 సంవత్సరాల పాటు ఈ టికెట్ చెల్లుబాటు గడువుగా నిర్ణయించారు. లేదా టిక్కెట్ పొందిన భక్తుడు మరణించిన సందర్భంలో ఈ టిక్కెట్ గడువు పూర్తవుతుంది. ఉదయాస్తమాన సేవల టిక్కెట్లను తొలుత 1983లో రూ.1 లక్షతో ప్రవేశపెట్టారు. 2006లో దీన్ని రూ.10 లక్షలకు పెంచారు. కాగా, ప్రస్తుతం రూ.1 కోటి, శుక్రవారాల్లో రూ.1.5 కోట్లుగా నిర్ణయించారు.