తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవాటికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. సెప్టెంబరు నెల కోటాకు సంబంధించిన టికెట్లను సోమవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీడిప్ ద్వారా 8,070 టికెట్లు కేటాయించనుంది.
అదేవిధంగా ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు జారీ చేస్తారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. దీనికోసం భక్తులు ఉదయం 10 గంటల నుంచి ఈనెల 29వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
టికెట్లు పొందిన వారి జాబితాను ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్సైట్లో పొందుపరుస్తారు. అదేవిధంగా భక్తులకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. వీరు రెండు రోజుల్లోపు టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు జూన్ 29న సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి.
శ్రీవారి కల్యాణోత్సవం ప్రతి రోజు ఉదయం 12 గంటలకు, ఆర్జిత బ్రహ్మోత్సవం మధ్యాహ్నం 2 గంటలకు, ఊంజల్ సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు, సహస్ర దీపాలాంకరణ సేవ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం అవుతాయి. అదేవిధంగా సుప్రభాత సేవ వేకువజామున 3 గంటలకు ప్రారంభం అవుతుంది. తోమాల సేవ మంగళ, బుధ, గురువారాల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు, స్వామివారి అర్చన అదే రోజుల్లో 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు టికెట్లతో అరగంట ముందే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అష్టదళ పాద పద్మారాధనం మంగళవారం ఉదయం 5.30 గంటలకు మొదలవుతుంది.