తిరుపతి : టీటీడీలో విద్యుత్ను ఆదా చేసేందుకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏపీఎస్ఈసీఎం (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్), నెడ్క్యాప్(నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ) సంస్థల అధికారులతో టీటీడీ సంప్రదింపులు చేపట్టింది.
టీటీడీలోని అన్ని విభాగాల్లో విద్యుత్ ఆదాకు తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై అధికారులతో సమావేశాలు నిర్వహించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన పరికరాల ఏర్పాటుపై ఎనర్జీ సర్వీసెస్ కంపెనీతో చర్చించింది. టీటీడీలోని తాగునీటి పంపింగ్ స్టేషన్లలో గల 100 పాత పంపు సెట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీఈవో ధర్మారెడ్డి తెలిపారు.
నెడ్క్యాప్ సంస్థ ఆధ్వర్యంలో అన్నప్రసాదాల తయారీకి సోలార్ స్టీమ్ కుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. ఈ విధానం ద్వారా వంటగ్యాస్ ఆదా అవుతుందన్నారు. ఈ మేరకు సదరు సంస్థల అధికారులతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు.