తిరుమల: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు (TTD Key Decision) తీసుకుంది. తిరుమలలో అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన పాలక మండలి సమావేశం చైర్మన్ బీఆర్ నాయుడు ( Chairman BR Naidu) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ సభ్యులు, ఎక్స్అఫిసియో సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో సభ్యులు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా టీటీడీ ఆస్తులు ( TTD Assets ) కాపాడేందుకు కమిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు.
భూమలు న్యాయపరమైన పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ వెల్లడించారు. టీటీడీలో పనిచేసే హిందూయేతర ఉద్యోగుల తొలగింపు, జూపార్కు నుంచి కపిలతీర్థం వరకు ప్రైవేట్ కట్టడాలు ఉండకూడదని తీర్మానం చేసినట్లు వివరించారు.
ఇతర దేశాల్లో ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు, పోటు కార్మికులకు జీఎస్టీతో సంబంధం లేకుండా రూ. 43 వేలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. గతంలో సైన్స్ సిటీకి కేటాయించిన 20 ఎకరాలు రద్దు చేస్తూ తీర్మానం చేశామని వెల్లడించారు.