TTD | వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లె రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ గుర్రుగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆయన వ్యవహరించారని ఆగ్రహంగా ఉంది. ఆయనపై చర్యలకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది.
శ్రీవారి ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, ఆరోపణలు చేయకూడదని ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అయితే దాన్ని పల్లె రవీంద్రనాథ్ రెడ్డి తాజాగా ఉల్లంఘించారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో పల్లె రవీంద్రనాథ్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పులివెందుల ఎన్నికలపై కూడా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. పల్లె రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. బోర్డు తీర్మానాన్ని ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది.
కాగా, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పల్లె రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంతో విసిగిన ప్రజలు.. 2029లో మళ్లీ వైఎస్ జగన్ గెలవాలని కోరుకుంటున్నారని తెలిపారు. అసలు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని అన్నారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం దారుణాలకు ఒడిగడుతుందని అన్నారు.
ప్రజలు ఓట్లు వేయడానికి లేకుండా, దొంగ కేసులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పల్లె రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఎన్నికుల జరగలేదని అన్నారు. వైఎస్ జగన్ తలచుకుంటే గతంతో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరిగేవాళ్లు కాదని.. నామినేషన్ కూడా వేసేవాళ్లు కాదని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం నేడు అరాచక పాలన చేస్తోందని విమర్శించారు. కూటమి అరాచక పాలనపై కోర్టును ఆశ్రయిస్తామని.. ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ పద్ధతి మార్చుకుంటే మంచిదని.. లేదంటే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.