హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ వేటువేసింది. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయర్లపై రమణ దీక్షితులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్నది. టీటీడీ నుంచి ఆయనను తొలగిస్తూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు పెంచుతూ పాలకమండలి నిర్ణయం తీసుకున్నది.
శ్రీవారి ఆలయంలోని జయ విజయుల వద్ద ఉన్న తలుపులకు రూ.1.69 కోట్లతో బంగారు తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. గాలిగోపురం, ఆంజనేయస్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇక నుంచి నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు. తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతోపాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.4 కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బొట్టుల తయారీకి పాలకమండలి నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 24న టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.