అమరావతి : వేసవిలో తిరుమల శేషాచలం అడవుల్లో జరిగే అగ్నిప్రమాదాలను సమర్ధవంతంగా నియంత్రించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ అటవీ సలహా మండలి సమావేశం జరిగింది. టీటీడీ పరిధిలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న వరుస అగ్నిప్రమాదాల నివారణకు అదనపు ఈవో చైర్మన్గా, డీఎఫ్వో మెంబర్ కన్వీనర్గా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశారు.
గత దశాబ్ద కాలంలో దాదాపు 50 అటవీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, 2016లో అత్యధికంగా 14 నమోదయ్యాయని అదనపు ఈవో తెలిపారు. అగ్ని ప్రమాదాల ఆధారంగా అటవీ ప్రాంతాలను జోన్లుగా విభజించడం, నియంత్రణ ఏర్పాట్లు, ఫైర్లైన్లు, ఫైర్ ఫైటింగ్ బృందాలకు శిక్షణ ఇస్తున్నామని వివరించారు. అధునాతన సాంకేతికతతో కూడిన అగ్నిమాపక యంత్రాలు సమకూర్చడం, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు.