TTD | భూలోక వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ బాలాజీ దేవాలయాలు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ నెల ప్రారంభంలో జమ్ము నగర శివారుల్లో శ్రీవారి భక్తుల కోసం తిరుపతి బాలాజీ దేవాలయం ప్రారంభించారు. జమ్ములోని శివాలిక్ అడవుల దిగువన 62 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించారు.
తాజాగా ఛత్తీస్గఢ్, గుజరాత్ రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర దేవాలయం నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళికను చురుగ్గా పరిశీలిస్తున్నది టీటీడీ బోర్డు. భక్తులకు మరింత చేరువయ్యేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బీహార్లో బాలాజీ దేవాలయం నిర్మాణం విషయమై ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్తో టీటీడీ సంప్రదింపులు జరుపుతున్నది. నేవీ ముంబైలో బాలాజీ దేవాలయం నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించింది. ఈ ఆలయం నిర్మాణానికి టీటీడీ రూ.70 కోట్లు ఖర్చు చేయనున్నది.
అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో కార్డియో-న్యూరో బ్లాక్ నిర్మించాలని ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశం నిర్ణయించింది. తిరుపతిలో అదనపు లడ్డూ కౌంటర్లు నిర్మించాలని కూడా తీర్మానించారు. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో ఐటీ మౌలిక వసతులను అప్ గ్రేడ్ చేయాలన్న నిర్ణయానికి టీటీడీ బోర్డు ఆమోద ముద్ర వేసింది.