తిరుపతి : దేశీయ గోజాతుల అభివృద్ధి, డెయిరీల నిర్వహణపై మహారాష్ట్రలో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్న టీటీడీ అధికారుల బృందం( TTD official team) బుధవారం బారామతిలోని ప్రఖ్యాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించింది. టీటీడీ జేఈవో సదా భార్గవి నేతృత్వంలో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకట నాయుడు బృందం మహారాష్ట్రలో పర్యటిస్తుంది.
ఇందులో భాగంగా బారామతిలోని ప్రఖ్యాత కృషి విజ్ఞాన కేంద్రం లో క్షేత్ర స్థాయి అధ్యయనం చేసింది. జన్యు ప్రక్రియ ద్వారా దేశీయ గోజాతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా ఈ బృందం పరిశీలించింది. దేశీయ గో జాతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాజమాన్య పద్ధతులు, స్వచ్ఛమైన పాల దిగుబడికి అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. ఇందుకు అవసరమయ్యే మౌలిక వసతులను పరిశీలించింది. టీటీడీ గోశాలలో రోజుకు 4 వేల లీటర్ల స్వచ్ఛమైన దేశ వాళీ ఆవు పాలను దిగుబడి చేసుకోవడానికి అనుసరించవలసిన విధానాలపై అక్కడి అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించారు.
మంగళవారం సాయంత్రం పూణె కు సమీపంలోని మంచార్ లో బృందం పర్యటించింది. ఆ గ్రామంలో ఉన్న పరాగ్ డెయిరీ కి చెందిన భాగ్యలక్ష్మి డెయిరీ ఫామ్ ను పరిశీలించి డెయిరీ లోని గో జాతుల ద్వారా అత్యధిక పాల ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాలను క్షేత్ర స్థాయిలో అడిగి తెలుసుకున్నారు.