TTD News | తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాటేజీ దాతల సిఫారసు లేఖలపై వచ్చే వారికి గదుల కేటాయింపు ఉండదని టీటీడీ తెలిపింది. ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజీ దాతలకు మాత్రమే వసతి గదులు కేటాయించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
దాతలు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా గదులను రిజర్వ్ చేసుకోవాలని సూచించింది. సెప్టెంబరు 18 నుంచి 26 తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 22న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 20 నుంచి 22 వరకు కాటేజీ దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని స్పష్టం చేసింది. అలాగే అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుంచి 19 వరకు కూడా దాతలకు గదులు కేటాయించబోమని చెప్పింది.
ఒకే కాటేజీలో రెండు గదుల కంటే ఎక్కువగా విరాళం ఇచ్చిన దాతలు స్వయంగా వస్తే రెండు గదులను రెండు రోజుల పాటు కేటాయించనున్నట్లు చెప్పింది. ఒకే కాటేజీలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలు స్వయంగా వస్తే ఒక గదిని రెండు రోజులపాటు కేటాయించడం జరుగుతుందని చెప్పింది. ఈ విషయాన్ని కాటేజీ దాతలు గమనించి, సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.