తిరుమల : వ్యాధులు లేని సమాజం రావాలన్నదే టీటీడీ ఆకాంక్ష అని టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. అందుకోసమే టీటీడీ సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. సేంద్రియ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయల సాగుపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో రాయలసీమ జిల్లాలకు చెందిన సేంద్రియ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈవో మాట్లాడారు.
గత ఏడాది సేంద్రీయ ఉత్పత్తులను వాడి శ్రీ వేంకటేశ్వర స్వామికి నైవేద్యం సిద్ధం చేయడం ప్రారంభించినట్లు ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. గోవిందునికి గో అధారిత నైవేద్యం అనతికాలంలోనే ప్రజాదరణ పొందిందన్నారు. అదేవిధంగా అన్నప్రసాదాల తయారీలో కూడా వీటిని విస్తరించాలని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. సహజ వ్యవసాయ పదార్థాలు, కూరగాయలతో చేసిన రుచికరమైన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యం కేవలం సేంద్రీయ రైతుల సహకారంతోనే సాధ్యమవుతుందన్నారు.
అంతకుముందు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు జిల్లాలకు చెందిన పలువురు రైతులు సేంద్రియ ప్రకృతి వ్యవసాయ రంగంలో తమ అనుభవాన్ని తెలిపారు. ప్రకృతి సేద్యానికి ఊతమిచ్చేలా అవకాశం కల్పించిన టీటీడీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. తమ భూముల్లో ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రీయ కూరగాయలు పండించడం ద్వారా టీటీడీకి అన్నప్రసాదం అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డీఈఓ సెల్వం, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ జీఎల్ఎన్ శాస్త్రితోపాటు రాయలసీమ జిల్లాలకు చెందిన సేంద్రీయ రైతులు పాల్గొన్నారు.