Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. తిరుమలకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పది రోజుల పాటు సిఫారసు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేసింది. ఒకవేళ వీఐపీలు వారి కుటుంబసభ్యులతో వస్తే మాత్రం దర్శనం టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. అలాగే వైకుంఠ ద్వారా దర్శనాలకు వచ్చే భక్తుల కోసం తిరుపతిలో 92 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లలో 4,23,500 సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టికెట్లు ఇవ్వనున్నారు. ఈ టికెట్లను డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇవ్వనున్నారు. దీంతో పాటు తిరుమలకు వచ్చే భక్తులకు పలు సూచనలు చేసింది.
* సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఉచిత టైమ్స్లాట్ టోకెన్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది. దీనిద్వారా క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.
* తిరుపతిలో టోకెన్లు తీసుకున్న తర్వాతనే తిరుమలకు రావాలని భక్తులకు టీటీడీ సూచించింది. టికెట్లు లేకుండా కూడా తిరుమలకు రావచ్చు.. కానీ వారికి దర్శనం ఉండదని తెలిపింది.
* టీటీడీ వెబ్సైట్, ఎస్వీబీసీ ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను తెలుసుకున్నా తర్వాతే భక్తులు తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలి.
* తిరుమలలో వసతీ గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు.. తమ టోకెన్లపై సూచించిన తేదీ, సమయానికే తిరుమలకు రావాలని సూచించింది.
* పర్వదినాల్లో రద్దీ దృష్ట్యా తిరుమలలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది.
* వైకుంఠ ద్వార దర్శనం ఫలితం 10 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి వీఐపీలు, ఇతర భక్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలని తొందరపడద్దు. పది రోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలి.