తిరుపతి : నెల్లూరులో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఏర్పట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు నెల్లూరు నగరంలో నిర్వహించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది.
ఈ సందర్భంగా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించే వైభవోత్సవాల ఏర్పాట్లపై జేఈఓ వీరభ్రహ్మం సమీక్షించారు. వేదిక వద్ద ఎండకు, వర్షానికి ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్డు, నమూనా ఆలయం, సేవల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లు, ప్రసాదాల తయారీకి పోటు, ప్రసాదాల కౌంటర్లు, పుస్తక విక్రయ కౌంటర్, టీటీడీ కార్యక్రమాల ఫొటో ఎగ్జిబిషన్, గోపూజ ఏర్పాట్లు, ప్రాంగణంలో గ్యాలరీలు, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పీఏ సిస్టం, ఎల్ఈడీ స్క్రీన్లు, విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా, పార్కింగ్ ప్రదేశాలు, సూచిక బోర్డులు, ప్రవేశ మార్గాల వద్ద ఆర్చిలు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కేంద్రాలు, భద్రత కోసం సీసీ కెమెరాలు, కంట్రోల్ రూం ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలపై పలు సూచనలు చేశారు. స్వామివారి సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని, భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని కోరారు.
జేఈఓ వెంట సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈలు జగదీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వీజీఓ మనోహర్, డీఈ రవిశంకర్ రెడ్డి, ఈఈ శ్రీమతి సుమతి, పీఆర్వో డాక్టర్ టీ రవి, సేల్స్ వింగ్ ప్రత్యేకాధికారి రామరాజు, డిప్యూటీ ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ ఆంజనేయ రాజు, వీపీఆర్ ఫౌండేషన్కు చెందిన పెంచల్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.