తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేలా అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని జేఈఓ శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. అలాగే ఎస్వీ సంగీత, నృత్య కళాశాలను మ్యూజిక్ మ్యూజియంలా తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో టీటీడీ విద్యాసంస్థలకు చెందిన ప్రత్యేకాధికారులు, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులతో విద్యాప్రమాణాల అభివృద్ధిపై ఆమె సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా జేఈఓ శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ విద్యాదాన ట్రస్టు ద్వారా కళాశాలలు, పాఠశాలల్లో విద్యాప్రమాణాలు ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆలోచించాలని సూచించారు. విద్యాసంస్థల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మౌళిక సదుపాయాల కల్పనకు కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎస్పీడబ్ల్యు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ వచ్చాయని, ఇకపై జూనియర్ కళాశాలల్లో కూడా మరింత మెరుగైన విద్యాప్రమాణాలు, వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు.
అధ్యాపకులు, ఉపాధ్యాయులు తరచూ విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహించి వారి నుంచి సలహాలను స్వీకరించి విద్యాబోధనకు సంబంధించి మరిన్ని మంచి చర్యలను ఆచరణలో పెట్టాలన్నారు. పరీక్షల ముందు విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేలా ప్రేరణ తరగతులు నిర్వహించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సంగీత, నృత్య కళాశాలలో ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారి జీవిత చరిత్రలు తెలియజేసేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ డీఈఓ గోవిందరాజన్, విద్యాసంస్థల ప్రత్యేకాధికారులు రవిప్రసాదు, శేషశైలేంద్ర, శ్రీమతి ప్రశాంతి, శ్రీమతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.