తిరుమల : అయోధ్య ( Ayodhya) లో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతోపాటు క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ(TTD) ఈవో ఏవి.ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారులు అవగాహన కల్పించారు. ట్రస్టు ఆహ్వానం మేరకు టీటీడీ అధికారులు శనివారం అయోధ్యకు చేరుకున్నారు.
ట్రస్టు కార్యాలయంలో ప్రతినిధులతో సమావేశం నిర్వహించి బాలరాముని(Balaram) ఆలయానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే విషయాలను టీటీడీ ఈవోను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్ జి, జగదీష్ ఆఫ్లే, గిరీష్ సహస్ర భోజని, విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాఘవులు, డిఎస్ఎన్ మూర్తి, టీటీడీ సాంకేతిక సలహాదారు జి.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.