తిరుమల : తిరుమల,తిరుపతి దేవస్థానం పాలకమండలి(Ttd Board) పలు కీలక నిర్ణయాలు(Key Decision) తీసుకుంది. పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి(Chairman) అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై జరిగిన తీర్మానాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు. తిరుపతి (Tirupati)లోని స్విమ్స్ పరిధిలో గల శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాల(Medical colleage)లో టీబీ, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టళ్ల నిర్మాణ పనుల కోసం రూ.53.62 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు.
టీటీడీ అవసరాలకు గాను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్ఫెడ్ తో చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కమిటీ ఏర్పాటు చేశారు. అలిపిరి వద్ద ఉన్న మార్కెటింగ్ గోడౌన్ వద్ద నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్ స్టోరేజి నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేశారు.
గుంటూరుకు చెందిన దాత ఆలపాటి తారాదేవి రూ.10 లక్షలతో వెండి కవచాన్ని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి అందించేందుకు సమావేశం ఆమోదం తెలిపింది. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఆధునీకరణ పనులకు రూ.3.12 కోట్లతో టెండరుకు ఆమోదం తెలిపారు. న్యూఢిల్లీలోని ఎస్వీ కళాశాలలో ఆడిటోరియం(Auditorium) అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. టీటీడీ విద్యాసంస్థల్లో రెగ్యులర్ బోధనా సిబ్బంది నియామకానికి, ఇప్పటికే పని చేస్తున్న కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని కొనసాగిస్తూనే రెగ్యులర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 3 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు పనులను త్వరితగతిన పూర్తి చేసి జూన్ 15వ తేదీ నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని ఆయన వివరించారు. ఎఫ్.సీ.ఆర్.ఏ (విదేశీ విరాళాల స్వీకరణ చట్టం) ప్రకారం విదేశీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరించడానికి టీటీడీకి అనుమతి ఉందని, అధికారుల సూచన మేరకు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.3 కోట్లు చెల్లించామని ఆయన తెలిపారు.