తిరుపతి : శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేసి జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బుధవారం సాయంత్రం ఆయన టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం అధికారులతో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణపనుల ప్రగతిపై సమీక్షించారు.
ప్లాంట్ షెడ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని, యంత్రాల సమీకరణ, వాటి ఏర్పాటు పనులు డిసెంబరుకు పూర్తి చేస్తామని అధికారులు తెలుపగా.. జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని వర్సిటీ అధికారులకు ఈఓ సూచించారు. ఫీడ్ తయారీకి అవసరమైన ముడిసరుకును అక్టోబరు చివరి నాటికే సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పశువైద్య వర్సిటీ, అమెరికాకు చెందిన న్యూటెక్ బయోసైన్సెస్ సంయుక్త నిర్వహణలో తయారయ్యే ఫీడ్ను ఎస్వీ గోసంరక్షణశాల, వర్సిటీ అవసరాలకు వినియోగించగా మిగిలినది లాభాపేక్ష లేని ధరతో రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
సమీక్షలో టీటీడీ జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎఫ్ఏసీఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల సంచాలకులు డాక్టర్ హరనాథరెడ్డి, వర్సిటీ విస్తరణ విభాగం సంచాలకులు డాక్టర్ వెంకటనాయుడు, పరిశోధన విభాగం సంచాలకులు డాక్టర్ సర్జన్రావు తదితరులు పాల్గొన్నారు.