న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో పాతికేండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ కు అనుమతించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కేంద్రాన్ని కోరారు. కొవిడ్-19 వ్యాప్తి, మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు సోనియా అధ్యక్షతన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ భేటీ అనంతరం ఆమె వ్యాక్సినేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక వ్యవస్దపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పైనా ఈ భేటీలో చర్చించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు తమ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న రాష్ట్రాల ప్రతినిధులతోనూ విస్పష్టంగా చర్చించానని, కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ సమర్ధంగా వ్యవహరించలేదనే అభిప్రాయం వ్యక్తమైందని సోనియా గాంధీ పేర్కొన్నారు. తమ పార్టీ సీఎంలతో సమావేశం అనంతరం తాను ప్రధానికి లేఖ రాశానని, సీఎంలు సైతం ప్రధానితో మాట్లాడారని కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటగా ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉందని ఆమె చెప్పారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందంటూ కాంగ్రెస్ నేతలు కేంద్రంపై విరుచుకుపడ్డారు. కాగా, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని, మహమ్మారితో దెబ్బతిన్న పేదల ఖాతాల్లో నగదు జమ చేయాలని కోరుతూ ఇప్పటికే సోనియా, రాహుల్ లు ప్రధాని మోదీకి లేఖ రాశారు.