TTD | తిరుమల : వేంకటేశ్వరస్వామి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని దేవస్థానం ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, అధికారులతో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకొని నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుత్తేదారుల్లో అలసత్వం లేకుండా ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని కోరారు. టీటీడీలో దళారి వ్యవస్థ, నకిలి టికెట్ల పేరుతో సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు మరింత నాణ్యంగా, వేగంగా సేవలు అందించేందుకు అలిపిరి టోల్ గేట్ ప్లాజా వద్ద చెకింగ్ పాయింట్ విస్తరణ, లేటెస్ట్ కెమెరాల ఏర్పాటు, వాహనాలు, లగేజీ స్కానింగ్ యంత్రాలు, సెక్యూరిటీ పెంచే అంశం తదితర అంశాలపై టిటిడి సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఐటీ అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయాలలో సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో కల్యాణ కట్ట కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్మాణం చేపట్టి దశలవారీగా విస్తరణ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు నిల్వ వుంచే వంటసామాగ్రి కోసం మార్కెటింగ్ గోడౌన్ లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అలిపిరి భూదేవి కాంప్లెస్ లో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం, కపిలతీర్థం, నారాయణవనంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం, అమరావతిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం, తిరుమలలోని పాపవినాసం, శిలాతోరణం ప్రాంతాలలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నవీ ముంబయి, బాంద్రా, యానం, అనంతవరం, ఉల్లందూర్ పేట తదితర ప్రాంతాలలో ఆలయాల నిర్మాణాలపై తాజా పరిస్థితిని నివేదించాలన్నారు.