తిరుపతి జిల్లా : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి గురువారం పరిశీలించారు. అధికారులతో వచ్చిన ఆయన ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి వెంట కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా గత కొంతకాలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. తిరుమల స్వామి వారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ సేతును ప్రారంభించేందుకు అధికారులు నిర్ణయించారు.
తిరుపతి నగరంలోని కరకంబాడి మార్గం నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా కపిలతీర్థం రోడ్డులోని వాసవి భవన్ వరకు నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అవసరమైన పనులను 26వ తేదీకల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్, టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ పనులు చేపడుతున్న ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధులకు ఈఓ ధర్మారెడ్డి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ బాలాజీ, మున్సిపల్ కమిషనర్ కుమారి అనుపమ అంజలి, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ మోహన్, ఆఫ్కాన్ సంస్థ మేనేజర్ రంగస్వామితోపాటు అదనపు ఎస్పీలు, డిఎస్పీలు కూడా పాల్గొన్నారు. సేతు నిర్మాణంతో కరకంబాడి నుంచి వాసవి భవన్ వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని ట్రాఫిక్ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.