తిరుమల : శేషాచల అడవుల్లో వృక్షసంపదను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అకేషియా (తుమ్మ) చెట్లను తొలగించి భూసారాన్ని పెంచాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తుమ్మ చెట్ల స్థానంలో సంప్రదాయ మొక్కల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో బుధవారం సీనియర్ అధికారులతో ఈవో ధర్మారెడ్డి సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు మోడల్ ప్రాజెక్టుగా ఒక హెక్టార్లో అకేషియా చెట్లను తొలగించి సంప్రదాయ మొక్కల పెంపకం చేపట్టారని, క్రమంగా విస్తరించాలని చెప్పారు. ఈ పనులపై సమగ్ర నివేదిక సమర్పించాలని కోరారు. భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా తిరుమల రోడ్ల సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. తిరుమలలో నిర్మాణంలో ఉన్న తరిగొండ వెంగమాంబ బృందావనం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. టీటీడీ పలు విభాగాల్లో పాత రికార్డులను పరిశీలించి ముఖ్యమైన వాటిని డిజిటైజ్ చేయాలని సూచించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ గోపురం బంగారు తాపడం పనులను అక్టోబరు నెలలోపు పూర్తి చేయాలన్నారు. తిరుపతిలోని గోశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిపుణుల సూచనల మేరకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు.
అనంతరం స్థానికాలయాల్లో జరుగుతున్న గోపూజపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, ఎఫ్ఏసీఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావుతోపాటు పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు.