TTD for Devotees | శ్రీవారి భక్తుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సానుకూల నిర్ణయం తీసుకున్నది. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఈ నెల 18 నుంచి 30 వరకు శ్రీవారిని దర్శించుకోలేకపోయిన వారికి మరో సమయంలో దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 25-28 మధ్య చిత్తూరు జిల్లాలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇప్పటికే దర్శన టికెట్లు తీసుకున్న భక్తుల కోసం ప్రత్యేకంగా టీటీడీ సాఫ్ట్వేర్ తయారు చేయనున్నది. దీని సాయంతో వచ్చే ఆరు నెలల్లో శ్రీవారి దర్శనం చేయడానికి వారు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతిలో అధిక వర్షపాతం నమోదైనా ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహా పెద్దగా నష్టం వాటిల్లలేదని, కానీ భక్తులు నిర్భయంగా వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చునని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది.
అలిపిరి నడక మార్గం చక్కగానే ఉందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ వివరించింది. సామర్థ్యాన్ని మించి భారీ వర్షం రావడంతో శ్రీవారి మెట్ల మార్గంలో నాలుగు కల్వర్టులు దెబ్బ తిన్నాయని, అప్పటివరకు ఆ మార్గం మూసి ఉంచుతామని వెల్లడించింది. భక్తులు నడవడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేశామని తెలిపింది.