తిరుమల: దేవనగరి తిరుపతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల కనుమదారులు దెబ్బతింటున్నాయి. బుధవారం ఉదయం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ (TTD) అధికారులు రెండో కనుమదారిని తాత్కాలికంగా మూసివేశారు. లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో కొండపైనుంచి రహదారిపై భారీ బండరాళ్లు పడ్డాయి.
దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు వాహనాలను నిలిపివేశారు. విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ ఇంజినీరింగ్, అటవీశాఖ అదికారులు కొండచరియలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాళ్లు, మట్టి పెల్లలు జారిపడే సమయంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం. ఈఘటనతో రెండో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.