తిరుమల : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం త్వరలో సాకారం కానున్నది. స్వామి వారి ఆలయ నిర్మాణానికి కావల్సిన భూమిని కేటాయించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో అహ్మదాబాద్లో కూడా శ్రీవేంకటేశ్వర స్వామి అక్కడి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే జమ్ము, భువనేశ్వర్, ముంబైలో శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులు మొదలయ్యాయి.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్తో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాలక మండలి సభ్యుడు కేతన్ దేశాయ్ సమావేశమయ్యారు. సీఎంకు శ్రీవారి ప్రసాదం అందించి శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా ముంబైలో నిర్మితమవుతున్న శ్రీవారి ఆలయం మాదిరిగా అహ్మదాబాద్లో కూడా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ సిద్ధంగా ఉన్నదని వైవీ సుబ్బారెడ్డి చెప్పడంతో.. అందుకు అనువైన భూమిని ఇస్తామని గుజరాత్ సీఎం హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారానికి చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రికి వివరించారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతున్నదని, ఇటీవలే భువనేశ్వర్లో శ్రీవారి ఆలయం పనులు ప్రారంభించామని తెలిపారు. త్వరలో ముంబైలో స్వామివారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని వెల్లడించారు. గుజరాత్లో కూడా స్వామి ఆలయ నిర్మాణానికి ఉచితంగా భూమి కేటాయించాలని కోరారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదన పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అధికారులతో చర్చించి టీటీడీకి అనువైన, అవసరమైన భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.