TTD News | నంద్యాల జిల్లా యాగంటి పుణ్యక్షేత్రంలో టీటీడీ కల్యాణమండపం త్వరలో అందుబాటులోకి రానున్నది. ఈ కల్యాణ మండపాన్ని రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ నిర్మిస్తున్నది. కల్యాణ మండపం నిర్మాణ పనులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని పురాతన ఆలయాలను పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. పవిత్ర పుణ్య క్షేత్రమైన యాగంటిలో రూ.3 కోట్ల వ్యయంతో కల్యాణ మండపం నిర్మిస్తున్నామన్నారు. ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించిన కల్యాణ మండపాలు మరమ్మతులకు నోచుకోకుండా ఉన్నాయని, అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయించాలని పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే నంద్యాలలో కల్యాణ మండపాన్ని పునర్నిర్మించడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బూరుగు రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, శాసనసభ్యులు రామిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జేఈఓ శ్రీమతి సదా భార్గవి, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, వీజీఓ మనోహర్, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.