తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ధర్మప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి( TTD Chairman Subbareddy) చెప్పారు. ఎస్వీబీసీ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని ఛానల్ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి కూడా భయపడిన సమయంలో భక్తులను ఆకట్టుకునేలా చక్కటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేశారని వెల్లడించారు.
ఎస్వీబీసీ(SVBC) ద్వారా ప్రసారం అయిన సుందరకాండ, భగవద్గీత లాంటి పారాయణాలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయన్నారు. దీని వల్ల ఛానల్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు పెరిగారని వెల్లడించారు. హిందీ, తమిళం, కన్నడ భాషలకు ఆయా కేంద్రాల్లో స్టూడియోలు నిర్మించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు.
టీటీడీ ఈవో, ఎస్వీబీసీ ఎండి ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషితో టీటీడీ సంస్థలతోపాటు సంస్కృత విశ్వవిద్యాలయంలోని పండితులు, ప్రవచనకర్తలు, మేధావులను అనుసంధానం చేసి అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర , సీఈవో షణ్ముఖ్కుమార్, బోర్డులు సభ్యులు నందకుమార్, టీటీడీ జేఈవో సదా భార్గవి, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ బోర్డు సభ్యురాలు వసంత కవిత, సలహాదారు నాగదుర్గారావు పాల్గొన్నారు.