TTD Chairman | తిరుపతిలో ఈ నెల 8వ తేదీన అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామి తెలిపారు. బోర్డు సభ్యులతో ఏర్పాటు చేసిన రెండు బృందాలు బాధితులకు పరిహారం అందజేశారని పేర్కొన్నారు.
తిరుమలలో సోమవారం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీపై కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు.