తిరుమల : కొవిడ్ తగ్గుముఖం పట్టడడంతో తిరుమలలో ఈసారి బ్రహ్మోత్సవ వేడుకలను మాడవీధుల్లో జరపాలని టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయించింది. ఇవాళ తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా సర్వదర్శనాల టైమ్స్లాట్ విధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చైర్మన్ మీడియాకు వెల్లడించారు.
రద్దీ తగ్గేవరకు టైమ్స్లాట్ దర్శన టోకెన్లు జారీచేయవద్దని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. రూ. 2.7 కోట్లతో పార్వేట మండపం కొత్త భవన నిర్మాణం చేపడుతామని తెలిపారు. ఎస్వీ గోశాల ఆవులకు పదినెలలకు సరిపడే రూ. 7.30 కోట్లతో గడ్డిని కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
అమరావతి శ్రీవారి ఆలయంలో పూల తోటల పెంపకం, బేడి ఆంజనేయ స్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం, తిరుమల ఎస్వీ పాఠశాలను సింగానియా గ్రూపునకు అప్పగింతకు నిర్ణయం తీసుకున్నారు. స్విమ్స్ ఆస్పత్రిలో ఐటీ అభివృద్ధికి రూ. 4.20 కోట్లు కేటాయించారు.