తిరుమల : దేశవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని టీటీడీ ఏర్పాటుచేసిన ల్యాండ్ కమిటీ చైర్మన్, రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె.శ్రీధర్ రావు వెల్లడించారు. జేఈవో సదా భార్గవి నేతృత్వంలో ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జున, ఇతర అధికారులు కమిటీ సూచనలను పక్కాగా అమలుచేశారని, దేశవ్యాప్తంగా గల 975 ఆస్తులను ప్రత్యక్షంగా పరిశీలించి రక్షణ చర్యలు చేపట్టారని ప్రశంసించారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 జనవరి 21 నుంచి 29 ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన రూ.23 కోట్ల విలువైన 20.45 ఎకరాలను టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. మొత్తం 109 ఆస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా టీటీడీకి రూ.4.15 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. జనక్పురి, రిషికేష్, డెహ్రాడూన్ తదితర దూర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అభివృద్ధి చేసి భక్తులకు ఏ విధంగా ఉపయోగపడేలా చేయాలనే విషయంపై సమావేశంలో చర్చించామని వెల్లడించారు.
ఆస్తులన్నింటికీ జియో మ్యాపింగ్ చేయాలని నిర్ణయించామని, తద్వారా సులువుగా గుర్తించడంతోపాటు ఆక్రమణలకు గురికాకుండా చూడవచ్చని అన్నారు. కల్యాణమండపాలను ఆసక్తి వ్యక్తీకరణ(EOI) ద్వారా లీజుకు ఇవ్వడం ద్వారా రూ.6 కోట్ల ఆదాయం లభించిందన్నారు. తమిళనాడులోని తంజావూరు జిల్లా కపిస్థలం ప్రాంతంలో వందేళ్ల క్రితం భక్తుడు కానుకగా సమర్పించిన 6 ఎకరాల స్థలాన్ని ఇటీవల టీటీడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.