విజయనగరం: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదాన్ని మరువక ముందే ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కంటకాపల్లి వద్ద విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఓవర్ హెడ్ కేబుల్ తెగిపోవడంతో ఆగిపోయిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలును వేగంగా వచ్చిన పలాస ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో రాయగడ ప్యాసింజర్లోని మూడు బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి. ప్రమాదంలో ముగ్గురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. కరెంటు లేకపోవడంతో ఘటనా ప్రాంతం అంతా చిమ్మచీకటిగా ఉంది. రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందిగా మారింది. కాగా రైలు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.