అమరావతి : సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు ఆడపిల్లలతో కలసి చెరువులో దూకి ఆత్మహత్య(Suicide) చేసుకుంది. జిల్లాలోని ముదిగుబ్బ మండల కేంద్రం టీచర్స్కాలనీకి చెందిన గంగాధర్, సుకన్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్త మధ్యగత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త వేధింపులను భరించలేక ఆదివారం సుకన్య తన ఇద్దరు పిల్లలు దేవయాని(10), జస్మిత(9)తో కలసి సమీపంలోని చెరువులో దూకింది. గమనించిన స్థానికులు వెంటనే చెరువులో దూకి గాలింపు చర్యలు చేపట్టారు.
గాలింపులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా తల్లి సుకన్య మృతదేహం కొద్ది దూరంలో లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. భార్య , భర్త మధ్య గొడవ కారణంగానే తల్లి సుకన్య ఈ దారుణానికి పాల్పడిందని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.