కాకినాడ: గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక వద్ద శనివారం గోదావరిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. అప్పటి నుంచి వారి జాడ కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది ఆదివారం ఉదయం ఆ నలుగురి మృతదేహాలను వెలికితీశారు.
వారంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. తణుకు పట్టణంలోని సజ్జాపురం ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు మూడు ద్విచక్ర వాహనాలపై శనివారం గోపులంక పుష్కరఘాట్కు విహారానికి వెళ్లారు. తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి విహారానికి వచ్చిన హనుమకొండ కార్తిక్ (21) అనే యువకుడు ముందుగా గోదావరిలో స్నానానికి దిగాడు.
వెంటనే అతడు నీటిలో మునిగిపోతుండటాన్ని మద్దెన ఫణీంద్ర గణేష్ (21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ (21) గమనించారు. స్నేహితుడిని రక్షించేందుకు వాళ్లు వెంటనే గోదావరిలో దిగారు. కానీ వాళ్లు కూడా ప్రవాహానికి కొట్టుకుపోతుండటంతో సలాది దుర్గా మహేష్, కొమ్మిరెడ్డి చైతన్య తమ స్నేహితులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడం ఒడ్డుకు తిరిగొచ్చారు. కాగా, మరో యువకుడు నేదూరు భానుప్రసాద్ జరిగిన ఘటనతో భయాందోళనకు గురై స్నేహితులకు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిసింది.