గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి దొర్లింది. మట్టి పెళ్లలు విరిగిపడటంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
గుంటూరు శివారులోని అమరావతి రోడ్డులో మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెల్లార్ను 20-30 అడుగుల లోతు వరకు తవ్వారు. బుధవారం ఉదయం రాడ్ బెండింగ్ పనులు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. దాంతో అక్కడే పనుల్లో నిమగ్నమై ఉన్న కార్మికులు మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు అలర్ట్ అయి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మట్టిపెళ్లల కింద నలిగి చనిపోయిన ముగ్గురు కార్మికులు మృతదేహాలను బయటకు తీశారు. మృతులను మజ్నూ, అమీన్, నజీబ్గా గుర్తించారు. బాధిత కార్మికులు బిహార్, బెంగాల్ ప్రాంతం నుంచి ఇక్కడి వచ్చి దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు
రాడ్ బెండింగ్ పనుల్లో బిహార్కు చెందిన 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, మట్టిపెళ్లలు కూలిన ప్రాంతంలో ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో ముగ్గురు అక్కడే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మల్టిప్లెక్స్ సెల్లార్ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న కార్మికులు ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా పనిచేస్తుండటం వల్లనే ఇలా ప్రమాదానికి గురికావాల్సి వచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు. గతంలో కూడా గుంటూరు నగరంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో ఇలాగే మట్టిపెళ్లలు కూలిపడి ఏడుగురు చనిపోయారు. సంఘటనాస్థలాన్ని గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ నిషాంత్ కుమార్ సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు.