Revanth Reddy | ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలించే నాయకులు కావాలని అనుకుంటున్నారు.. కానీ ప్రశ్నించే గొంతులు లేవని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవు కాబట్టే ఢిల్లీలో ఉన్న మోదీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చలాయించాలని అనుకుంటున్నారని అన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు పేరిట వైజాగ్లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రశ్నించే వాళ్లు లేరు కాబట్టే ఏపీ హక్కుల గురించి ఎవరూ మాట్లాడతలేరని అన్నారు. ప్రశ్నించే వాళ్లు లేరు కాబట్టే పదేండ్లు అయినా పోలవరం పూర్తి కాలేదని.. ఇప్పటికీ చెప్పుకోవడానికి రాజధాని లేదని విమర్శించారు. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని అన్నారు. తెలంగాణ అయినా.. ఆంధ్రా అయినా.. ఢిల్లీ వెళ్లి వంగి వంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప.. ఢిల్లీని అడిగి మనకు కావాల్సినవి సాధించే నాయకత్వమే లేదని అన్నారు.
బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వీళ్లే మోదీ బలం, బలగం అని అన్నారు. ఎవ్వరు గెలిచినా ఆయన దొడ్లోకి వెళ్తారు.. ఏపీలో 25 ఎంపీలు మోదీ ఖాతాలోనే ఉంటాయి.. ఇక ఏపీ ప్రజలకు మోదీ ఏం చేస్తారు? అని అన్నారు. జగన్ రెడ్డి పక్కన ఉన్న.. చంద్రబాబు పక్కన ఉన్న.. ఢిల్లీ వెళ్తే ఇద్దరూ మోదీ పక్కనే ఉంటారని విమర్శించారు. ఢిల్లీలో వీళ్లు మోదీని నిలదీస్తారా? అని ప్రశ్నించారు. వాళ్లిద్దరూ పాలన చేసే నాయకులు కావాలని అనుకుంటున్నరు తప్ప.. ప్రశ్నించే గొంతులు కావాలని అనుకోవట్లేదని విమర్శించారు.