శ్రీశైలం : శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదీకి వరద పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి క్రస్టుగేట్లు ఎత్తారు. దీంతో జల సవ్వడిని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. క్రస్టుగేట్ల నుంచి నదిలోకి జారుతున్న నీటిని చూసి ఆనంద పరవశానికి లోనవుతున్నారు. సెల్ఫీలు దిగి జలసవ్వళ్ల అందాలను తమ సెల్ఫోన్లో బంధిస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో భారీగా పెరిగింది. ఎగువ నుంచి దాదాపు 4,93,480 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి స్పిల్వే ద్వారా 4.70 లక్షల క్యూసెక్కులుపైగా నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా మరో 30,735 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 25,426 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం 5,26,621 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు వెళ్తున్నది. మరో రెండు రోజులు ఇదేస్థాయిలో వరద కొనసాగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.