కడప : ఖరీఫ్లో టమాట సాగు చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. దాంతో టమాట ధర అమాంతం పెరిగిపోయింది. దిగుబడి కరువై మార్కెట్కు తక్కువ పరిమాణంలో వస్తుండటంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సామాన్యులు టమాట అంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. గత నెల 1 వ తేదీన కడప రైతుబజార్లో కిలో రూ.11 ఉండగా, ప్రస్తుతం రూ. 28 కు చేరింది. బయటి మార్కెట్లో కిలో రూ.30 గా ఉన్నది.
కడప జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 470 ఎకరాల్లో టమాట సాగు చేశారు. మైలవరం, కలసపాడు, ఎర్రగుంట్ల, ఖాజీపేట, సింహాద్రిపురం, వీఎన్ పల్లె, లింగాల, తొండూరు, సీకేదిన్నె, పెండ్లిమర్రి, చక్రాయిపేట మండలాల్లో ఎక్కువగా టమాట సాగు చేశారు. ఈ నెలాఖరుకు కోతలు ముగుస్తాయి. ఫలితంగా మార్కెట్కు టమాట ఆశించినంతగా రావడం లేదు. దాంతో వీటి ధరలు ఆకాశాన్నంటేలా పెరిగిపోయాయి. జూలై 20 – 25 మధ్య కిలో రూ.10కి దొరికింది. ఇప్పుడు రూ.28-32 కి చేరింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. రానున్న రోజుల్లో టమాట ధర ఎంత వరకు పెరుగుతుందో వేచి చూడాలి.
కడప జిల్లాలో ఎక్కువగా సాగు చేసే టమాటలు హైదరాబాద్తో పాటు బెంగళూరు మార్కెట్కు వెళ్తుంది. అయితే, గత కొన్నిరోజులుగా ఖరీఫ్ సాగు చివరి దశకు చేరడంతో దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు కడపలో దొరుకుతున్న టమాట కేవలం జిల్లా వాసులకే సరిపోయేదిగా ఉన్నది. అలాగే, దిగుబడి లేక ధర కూడా అమాంతం పెరిగిపోయింది. కొత్తగా టమాట నారు నాటి ఉత్పత్తి వచ్చే వరకు టమాట ధరలు మరింత పైకి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.