(MLA deadline) కడప: రైల్వే అధికారులకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. ఈ నెల 10 వ తేదీలోగా కమలాపురం రైల్వేస్టేషన్లో అన్ని రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని డెడ్లైన్ విధించారు. లేనిపక్షంలో రైల్రోకో చేపడతామని ఆయన హెచ్చరించారు. కమలాపురం రైల్వేస్టేషన్తోపాటు నందలూరు, కొండాపురం తదితర రైల్వేస్టేషన్లలో రెండేండ్లుగా పలు రైళ్లు నిలుపడం లేదు. దాంతో కమలాపురం నియోజకవర్గానికి చెందిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి స్థానిక రైల్వేస్టేషన్కు వెళ్లి స్టేషన్ మేనేజర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
కరోనా సాకుగా చూపిస్తూ కమలాపురం రైల్వేస్టేషన్లో గత రెండేండ్లుగా రైళ్లు ఆపడం లేదని ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. కమలాపురం రైల్వేస్టేషన్ నుంచి మైదుకూరు, బద్వేల్ తదితర నియోజకవర్గాల ప్రజల ఈ స్టేషన్ల గుండానే ప్రయాణిస్తుంటారని చెప్పారు. కరోనా వ్యాప్తి కన్నా ముందు రోజుల్లో కమలాపురం నందలూరు స్టేషన్లలో వెంకటాద్రి, రాయలసీమ, హరిప్రియ, ముంబయి-చెన్నై, నంద్యాల-కడప ప్యాసింజర్ రైళ్లను ఆపేవారన్నారు. ముద్దనూరు స్టేషన్లో ఈ రైళ్లతో పాటు విశాఖ-కడప ఎక్స్ప్రెస్ కూడా ఆగేదని చెప్పారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు కమలాపురం, నందలూరు, ముద్దనూరు రైల్వేస్టేషన్లలో గతంలో ఆగే రైళ్లన్నీ నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 10న రైల్ రోకో చేపడతామని హెచ్చరించారు.