తిరుపతి : తిరుపతి(Tirupati)లోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం మిథున లగ్నంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రం(Garuda Flag)తో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు.
మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశమని పండితులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, కంకణభట్టార్, ఎపి.శ్రీనివాసదీక్షితులు, ఆగమ సలహాదారులు, సీతారామాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.