తిరుపతి : తిరుపతి(Tirupati) లోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం(Pushpayagam) జరుగనుంది. ఇందుకోసం ఏప్రిల్ 3న ఒక రోజు ముందుగా సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు అంకురార్పణతో కార్యక్రమం మొదలవుతుందని ఆలయ అర్చకులు వెల్లడించారు. ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam ) అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనావయితీగా వస్తుందన్నారు.
ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసమని అన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 4న ఉదయం శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహణ ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారాని వివరించారు. శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 3న అష్టోత్తర శతకళశాభిషేకం, ఏప్రిల్ 4న తిరుప్పావడ, నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసిందని వెల్లడించారు.