తిరుపతి : తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న అరుదైన, క్లిష్టమైన ఆపరేషన్లపై అవగాహన కల్పించేందుకు బర్డ్ ఆస్పత్రి(Bird Hospital)లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ‘ఆపరేటివ్ ఆర్థో ప్లాస్టీ సమ్మిట్’(Operative Orthoplasty) పేరిట లైవ్ సర్జరీలు నిర్వహిస్తుంది. ఆసుపత్రి వైద్యులతో పాటు దేశంలోని ఆర్థో వైద్యులు లైవ్ సర్జరీలను చూసి సందేహాలను, సలహాలను తెలుసుకునేందుకు టీటీడీ(TTD) జూలై 2 వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని బర్డ్ ఆస్పత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి తెలిపారు.
ఈ సమ్మిట్లో దేశంలోని టాప్ 20 ఆర్థో వైద్య నిపుణులు లైవ్లో సర్జరీ చేస్తారని వివరించారు. ఇప్పటిదాకా నమోదు చేసుకున్న సుమారు 200 మంది వైద్యులు బర్డ్ ఆసుపత్రి లోని ఆధునిక ఆపరేషన్ థియేటర్లో జరిగే సర్జరీలను ఫార్చూన్ గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో వీక్షిస్తారని తెలిపారు. సర్జరీకి సంబంధించి తమకు తెలియని విషయాలను సర్జరీ చేస్తున్న ప్రముఖ వైద్యులను అడిగి తెలుసుకోవచ్చని అన్నారు.
బర్డ్ చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైద్యుల నుంచి వచ్చిన స్పందన దృష్ట్యా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించాలని బర్డ్ ట్రస్ట్ నిర్ణయించింది. డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ దీపక్ పర్యవేక్షణలో సమ్మిట్ ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని రెడ్డెప్ప రెడ్డి తెలిపారు.