తిరుపతి : తిరుపతి(Tirupati) శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam)ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మే 20 నుంచి 25వ తేదీ వరకు బంగారు తాపడ విమాన గోపుర మహాసంప్రోక్షణ (Maha Samprokshanam) జరుగనున్న విషయం తెలిసిందే. మహాసంప్రోక్షణ ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణం లోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు . అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
తిరుపతికి చెందిన మణి అనే భక్తుడు ఆలయానికి మూడు పరదాలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవి కుమార్, ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.