తిరుపతి : తిరుపతి(Tirupati)లోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 24 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా జూన్ 22న, 24 నుంచి 27 వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవలను (Aarjita Sevas)రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వైభవోత్సవాల సందర్భంగా 22వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని(Tirumanjanam) వైభవంగా నిర్వహించనున్నామని వారు వివరించారు.
ఇందులో భాగంగా మూడు రోజులపాటు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తామన్నారు. 24న పెద్ద శేష వాహనం, జూన్ 25న హనుమంత వాహనం, జూన్ 26న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు.
27న శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 నుంచి పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా జూన్ 22న తిరుప్పావడసేవ, జూన్ 24 నుంచి 27వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.