తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి (Varalaxmi Vratam) భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ (TTD) జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. 500 మంది గృహస్తులు నేరుగా టిక్కెట్లు కొనుగోలు చేసి ఆస్థాన మండపంలో పాల్గొంటారని వెల్లడించారు.
ఇప్పటివరకు దాదాపు 778 మంది గృహస్తులు వర్చువల్ సేవ టికెట్లు (Virtual Tickets)బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని జేఈవో అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు.
అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.