Tirumala | తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో భక్తుల రాకపోకలను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నది. అలాగే తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తాత్కాలికంగా రద్దు చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ మిగ్జాం తుఫాను కారణంగా తిరుమల, తిరుపతి పరిసరాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నది. వర్షం నేపథ్యంలో శ్రీవారి మెట్టు మార్గంతో పాటు పాపవినాశనం రోడ్డులోని జాపాలి హనుమాన్ ఆలయం, ఆకాశగంగ తీర్థం, శ్రీవారి పాదాలు, శిలాతోరణంతో పాటు పలు ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు అనుమతిని నిలిపివేసింది. ఆయా మార్గాల్లో చెట్లు విరిగిపడడం, ఎడతెరిపి లేని వర్షం కారణంగా అనుమతిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం అధికారులు వివరించారు.
ఇదిలా ఉండగా.. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని ఏఎన్సీ కాటేజ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద భారీగా చెట్లు నేలకొరిగాయి. ఏఎన్సీలో 412 కాటేజ్ దగ్గర ఉన్న భారీ వృక్షం నేలకూలడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తర్వాత అటవీశాఖ అధికారులు చెట్ల కొమ్మలను తొలగించారు. మరో వైపు కపిలతీర్థం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. కపిలతీర్థంలో స్నానాలు చేసేందుకు భక్తులకు అనుమతిని నిలిపివేసింది. ఈ మేరకు భక్తులు సహకరించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.